CM Revanth Reddy : నేడు సీఎం రేవంత్ పాదయాత్ర

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ ప్రాంత పర్యటనకు సర్వం సిద్ధం అయింది. శుక్రవారం పుట్టిన రోజు సందర్భంగా, మూసీ ప్రాంతంలో సీఎం రేవంత్ పాదయాత్ర నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వివరాలను గురువారం కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుక్రవారం కుటుంబ సమేతంగా హెలికాప్టర్లో ఉదయం 8:45 గంటలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారని తెలిపారు. స్వామి వారి దర్శనం, ప్రత్యేక పూజల అనంతరం 10:00 గంటలకు వైటీడీఏ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 1:00 గంటలకు వలిగొండ మండలం సంగెం గ్రామం చేరుకుంటారు. మూసీ పరివాహక ప్రాంత రైతులతో మూసీ నది వెంట పాదయాత్ర ద్వారా భీమ లింగం, ధర్మారెడ్డి కాల్వలను సందర్శిస్తారని తెలిపారు. అనంతరం మూసీ పరివాహ ప్రాంతం రైతులతో సమావేశం అవుతారని, మూసీ మురికి కూపంలో కొట్టుమిట్టాడుతున్న రైతుల యోగా క్షేమాలు అడిగి తెలుసుకుంటారని వివరించారు. రైతులతో సమావేశం అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com