TG : కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి : శాంతి కుమారి

ఉత్తర తెలంగాణా లోని 11 జిల్లాలలో ఈనెల 20 , 21 తేదీలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆయాజిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేర్కొన్నారు. జూలై 20, 21 తేదీలలో 11 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ ను ప్రకటించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో నేడు రాత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనితోపాటు 8 జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలకు పక్కా భవనాల గుర్తింపు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనా, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకం తదితర అంశాలపై కూడా ఈ టెలికాన్ఫరెన్స్ లో సమీక్షించారు. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు తదితర అధికారులు ఈ టెలీకాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, హన్మకొండ, జగిత్యాల, ఖమ్మం,కొత్తగూడెం, నిర్మల్ జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది, ఈ జిల్లాల కలెక్టర్లు ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలసి ముందు జాగ్రత చర్యలు తీసుకోవాలని తెలియ చేశారు. ప్రధానంగా వాగుల వద్ద తగు బందోబస్తును ఏర్పాటు చేసి, ప్రమాదకరంగా ప్రవహించే వాగులను ప్రజలు దాటకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ 11 జిల్లాల్లో కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని, పోలీస్ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలని తెలియచేశారు. ఏ విధమైన సహాయం కావాలన్న రాష్ట్ర రాజధానికి ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చునని ఆమె అన్నారు. గురువారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్ద వాగు కు వచ్చిన ఆకస్మిక వరదల వల్ల చిక్కుకుపోయిన దాదాపు 40 మందికి ఏవిధమైన అపాయం జరుగకుండా వివిధ శాఖల సమన్వయంతో కాపాడినందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ను సి.ఎస్ అభినందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com