కరోనా సెకండ్వేవ్ మొదలైంది.. అప్రమత్తంగా ఉండాలి : తెలంగాణ హైకోర్టు

కరోనా సెకండ్వేవ్ కనిపిస్తోందన్న తెలంగాణ హైకోర్టు.. అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. కేసులు పెరిగే ప్రమాదం పొంచి ఉన్నందున.. ప్రజలు ఎక్కువ సంఖ్యలో గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. మహారాష్ట్ర, కర్నాటక వంటి పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయన్న విషయాన్ని గుర్తు చేసింది. రాష్ట్రంలో వీలైనంత త్వరలో సీరం సర్వే చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సర్వే నివేదిక సిఫార్సులు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. రేపటి నుంచి కరోనా బులిటెన్ రోజూ విడుదల చేయాలని కూడా ఆదేశించింది.
తెలంగాణలో చేస్తున్న కరోనా పరీక్షలపై హైకోర్టుకు నివేదిక సమర్పించింది ప్రభుత్వం. జనవరి 25 నుంచి ఈనెల 12 వరకు జరిపిన పరీక్షల వివరాలు తెలిపింది. ఆర్టీ-పీసీఆర్ ద్వారా లక్షా 3వేల 737 టెస్టులు, ర్యాపిడ్ యాంటీజెన్ ద్వారా 4 లక్షల 83వేల 266 పరీక్షలు జరిపామని కోర్టుకు వివరించింది. జూన్ 3 నుంచి డిసెంబర్ వరకు మూడు సీరం సర్వేలు జరిగాయని కోర్టుకు తెలిపింది. తెలంగాణలో కరోనా కేసులపై తదుపరి విచారణను మార్చి 18కి వాయిదా వేసింది హైకోర్టు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com