Siddipet : గుండెపోటుతో దివ్యాంగుడి మృతి

ట్రిఫుల్ ఆర్ కోల్పోతున్న భూమికి తక్కువ మొత్తంలో పరిహారం వస్తుందని మనోవేదనతో దివ్యాంగుడు గుండెపోటుతో మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. మర్కుక్ మండలం నరసన్నపేట గ్రామానికి చెందిన ఎంబారి బిక్షపతి (42) గ్రామ పరిధిలో తనకున్న ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో బిక్షపతికి నాలుగు రోజుల కిందట అధికారులు భూసేకరణకు సంబంధించి నోటీసును అందించారు. బహిరంగ మార్కెట్లో ఎకరంభూమి రూ. కోటి ధర పలుకుతుంటే ప్రభుత్వం పరిహారంగా కేవలం రూ. 8 లక్షలు మాత్రమే ఇస్తామని నోటీసులో పేర్కొనడంతో గత రెండు రోజులుగా మనోవేదనతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి గుండెపోటుకు గురై మృతి చెందాడు. మృతుని భార్య అనసూయ 3 ఏండ్ల కిందట ఆత్మహత్య చేసుకోవడంతో ఇద్దరు పిల్లల్ని బిక్షపతి పోషించుకుంటున్నాడు. బిక్షపతి మృతితో కూతురులు నిత్య (10), రితిక (8) లు అనాథలయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com