CM Revanth Reddy : పరవునష్టం కేసు కొట్టేయండి.. హైకర్టులో సీఎం రేవంత్ పిటిషన్

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న కేసు కొట్టివేయాలని బుధవారం దాఖలు చేసిన పిటిషన్లో కోరారు. గతేడాది ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్ నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం దావా వేశారు. ఈక్రమంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని రేవంత్ రెడ్డి అన్నారని కాసం తన పిటిషన్లో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పింగ్లను సైతం కాసం కోర్టుకు సమర్పించారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ప్రజాప్రతినిధుల కోర్టు సాక్షుల వాంగ్మూలం నమోదు చేసింది. విచారణలో ఉన్న ఈ కేసును కొట్టేయాలని సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ చేపట్టవద్దని, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అలాగే కోర్టు హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఈ పిటిషన్ పై గురువారం హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉందని న్యాయవాదులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com