TG: తెలంగాణలో పోలింగ్‌కు సర్వం సిద్ధం

TG: తెలంగాణలో పోలింగ్‌కు సర్వం సిద్ధం
అప్రమత్తంగా ఉండాలన్న తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌

తెలంగాణలో 2నెలలుగా ఉద్ధృతంగా సాగిన ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఇక ఎన్నికల సంఘం పని మొదలైంది. పోలింగ్‌ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఓటింగ్‌ జరిగేలా ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈనెల 13న జరిగే పోలింగ్‌కు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ప్రశాంత వాతావరణంలో ఓటింగ్‌ జరిగేలా చర్యలు చేపట్టినట్లు C.EOవికాస్‌రాజ్‌ తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు రాష్ట్ర పోలీసులు, వివిధ కంపెనీలకు చెందిన బలగాలను సిద్ధం చేశామన్న వికాస్‌రాజ్‌.... పటిష్ఠ బందోబస్తు నడుమ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. అక్రమ నగదు, మద్యం రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులను వికాస్‌రాజ్‌ ఆదేశించారు. 48 గంటల పాటు రేయింబవళ్లు అధికారులు నిఘా పెట్టాలని కోరారు. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ శాసనసభ ఉపఎన్నికకు సైతం అన్ని ఏర్పాట్లు చేశామన్న ఎన్నికల ప్రధానాధికారి... ఇప్పటివరకు పట్టుకున్న నగదు, నమోదు చేసిన కేసుల వివరాలను వెల్లడించారు. అధికారులతోపాటు రాజకీయ నాయకులందరూ ఎన్నికల నిబంధనలను పాటించాలని వికాస్‌రాజ్‌ సూచించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లైతే ప్రజలు ఫిర్యాదు చేయవచ్చన్నారు.


మూగబోయిన మైకులు

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఐదు పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాయంత్రం 4 గంటలకు ప్రచారం ముగియగా మిగతా రాష్ట్రమంతటా సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసింది. ఆదిలాబాద్ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని సిర్పూర్, ఆసిఫాబాద్ సెగ్మెంట్‌ పరిధిలో సాయంత్రం 4 కే ప్రచారం ముగిసింది. పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గపరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి,మంచిర్యాల, మంధని, వరంగల్‌నియోజకవర్గంలోని భూపాలపల్లి, మహబూబాబాద్ పరిధిలోని ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, ఖమ్మం పరిధిలోని కొత్తగూడెం, అశ్వరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలో సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగించారు.

ఓటర్లను ప్రలోభపెట్టేందుకు మద్యం,డబ్బులు, కానుకలు పంపిణీ జరిగే అవకాశం ఉండటంతో ఎన్నికల కమిషన్ అప్రమత్తమైంది. ప్రలోభాలకు ఆస్కారం ఉండేచోట....ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టాలని కలెక్టర్లను సీఈవో వికాస్‌రాజ్‌ ఆదేశించారు. ఈనెల 13న జరిగే పొలింగ్‌ కోసం EC ఏర్పాట్లు చేస్తోంది. ప్రచారం ముగియగానే ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతుండటంతో... ఎన్నికల కమిషన్ అప్రమత్తమైంది. ప్రలోభాలు, హింసాత్మక ఘటనలపై చివరి 72 గంటలు నిఘా పెంచాలని జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ స్పష్టంచేశారు.

Tags

Next Story