Etela Rajendar : పార్టీ ఆదేశిస్తే కేసీఆర్ మీద పోటీ చేస్తా : ఈటల

Etela Rajendar : పార్టీ ఆదేశిస్తే కేసీఆర్ మీద పోటీ చేస్తానని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ చెప్పారు. బీజేపీలో విభేదాలు లేవని, అందరం కలిసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నామన్నారు. టీఆర్ఎస్లో భవిష్యత్తు లేదనుకునే వాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిపారు. హైదరాబాద్లో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఈటల పాల్గొన్నారు.
కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితి లో తెలంగాణ ప్రజలు లేరని, ఓట్లకోసం తప్ప ప్రజల కోసం పనిచేయని వ్యక్తి అని ఈటల అన్నారు. కేసీఆర్ పాలనపై టీఆర్ఎస్ నేతలే సంతృప్తి గా లేరని, సమయం వచ్చినప్పుడు వారు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. టీఆర్ఎస్లో ఎవరికీ మాట్లాడే హక్కు లేదని, ఆ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలా మారిందన్నారు.
వందల ఎకరాలు ఉన్నవారికి సైతం రైతుబంధు అమలు చేస్తున్నారని, దీనిని తాను ప్రశ్నించినట్లు ఈటల గుర్తుచేశారు. రైతుబంధు డబ్బులు కేసీఆర్ ఇంట్లోనివి కావని, అవి తెలంగాణ ప్రజల చెమట నుంచి వచ్చిన డబ్బులన్నారు. కేసీఆర్, తనకూ రైతుబంధు ఇవ్వడం సమంజసమా అని ప్రశ్నించారు. రైతు కూలీలు, కౌలు దారులను కేసీఆర్ విస్మరించారన్నారు. రైతుల పై ముఖ్యమంత్రికి ప్రేమలేదని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com