TG : గంజాయి స్మగ్లర్లతో పోలీసులకు లింకులు.. నలుగురు సస్పెన్షన్

తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి పాటుపడాల్సిన పోలీసులే స్మగ్లర్లకు సహకరించడంపై డిపార్టుమెంట్ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలున్న ఇద్దరు ఎస్ఐలతో పాటు ఓ హెడ్ కానిస్టేబుల్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ మల్టీజోన్ 2 ఐజీపీ వి. సత్యానారయణ శుక్రవారం ఆదేశాలిచ్చారు. ఇటీవల సంగారెడ్డి జిల్లాలోని చిరాగ్ పల్లి, బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న మల్లుగొండ మల్లేష్ నాయక్, లకాస్లను పట్టుకుని పోలీసులు విచారించారు. సదరు నేరస్థులు గతంలో కూడా గంజాయి రవాణా చేస్తున్నారని తెలియడంతో జిల్లా ఎస్పీ రూపేష్ నిందితుల చరిత్రపై విచారణ చేపట్టారు. గతంలో మనూర్ పోలీస్ స్టేషన్లో, ప్రస్తుతం పటాన్ చెరులో ఎస్ఐగా పనిచేస్తున్న అంబారియాకు గంజాయి రవాణా చేసే ముఠాతో సంబంధాలున్నట్లు తేలింది. సంగారెడ్డి రూరల్ ఎస్ఐగా పనిచేసిన వినయకుమార్కు ఇసుక అక్రమ రవాణా చేసే వారితో సం బంధాలున్నట్లు విచారణలో తేలింది. దీంతో ఎస్ఐ వినయ్ కుమార్ ను సంగారెడ్డి వీఆర్ కు బదిలీ చేశారు. అయితే ఎస్ఐ వినయ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ మారుతీ నాయక్, మనూర్ పోలీస్ స్టేషన్లో డ్రైవర్ గా పనిచేసిన ఏఆర్పీసీ మధులకు గంజాయి స్మగ్లర్లతో లింకులు ఉన్నట్లు ఎస్పీ రూపేష్ విచారణలో తేలింది. దీంతో ఆ నివేదికను మల్టీ జోన్2 ఐజీపీ వి.సత్యానారయణకు పంపించారు. దీంతో ఐజీపీ సత్యానారాయణ గంజాయి స్మగ్లింగ్ తో సంబంధాలున్న వీరిని విధుల నుంచి సస్పెండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com