టీఆర్ఎస్ చర్లపల్లి టికెట్‌ బొంతు రామ్మోహన్‌కా..? ఆయన సతీమణికా..?

టీఆర్ఎస్ చర్లపల్లి టికెట్‌ బొంతు రామ్మోహన్‌కా..? ఆయన సతీమణికా..?

105 మంది అభ్యర్థులతో గ్రేటర్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది టీఆర్ఎస్. మెజార్టీ స్థానాల్లో సిట్టింగ్‌లకే తిరిగి టికెట్లు కేటాయించారు. కేకే కుమార్తె విజయలక్ష్మి, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి, మన్నె కవిత సహా పలువురికి టికెట్లు ఖరారు చేశారు. చర్లపల్లి టికెట్‌ బొంతు రామ్మోహన్‌కా..? ఆయన సతీమణికా..? అన్న సస్పెన్స్ కొనసాగుతోంది.. ఇక హోరాహోరీగా పోరు ఉంటుందన్న చోట్ల ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు.. ఓల్డ్‌సిటీలో 30 డివిజన్లకు అభ్యర్థుల్ని ప్రకటించారు.

మొత్తం 150 డివిజన్లలో ప్రస్తుతం 105 మంది అభ్యర్థుల్ని మాత్రమే ప్రకటించారు. మిగతా 45 మంది జాబితాను గురువారం విడుదల చేయనున్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే భార్యకు టికెట్ పెండింగ్‌లో పెట్టారు. ఆమె ప్రస్తుతం హబ్సిగూడ కార్పొరేటర్‌గా ఉన్నారు. అంబర్‌పేట ఎమ్మెల్యే భార్యకు గోల్నాక టికెట్ విషయంలోనూ సస్పెన్స్ కొనసాగుతోంది. హఫీజ్‌పేట, మాదాపూర్‌ కార్పొరేటర్లకు మళ్లీ బంపర్ ఆఫర్‌ ఇచ్చారు. మరోసారి భార్యాభర్తలు జగదీశ్వర్‌గౌడ్‌, పూజితకు టికెట్లు ఖరారు చేశారు. సోమాజిగూడ కార్పొరేటర్‌ విజయలక్ష్మికి అనారోగ్యంతో సంగీత యాదవ్‌కు ఛాన్స్‌ ఇచ్చారు. రామచంద్రాపురం టికెట్‌ సిట్టింగ్‌కు కాదని పుష్పనగేష్‌ యాదవ్‌కు కేటాయించారు. ఇక బోరబండ నుంచి మళ్లీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్‌కు టికెట్‌ ఖరారు చేశారు. ఇక కొందరు వివాదాస్పద కార్పొరేటర్లకు మరోసారి టికెట్లు ఇచ్చారు.

అటు.. GHMC ఎన్నికల్లో టిక్కెట్ల లొల్లి మొదలైంది. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన సిట్టింగ్‌ కార్పోరేటర్‌కు నాచారం డివిజన్‌ టికెట్‌ ఇచ్చింది టీఆర్‌ఎస్‌. దీంతో ఈ స్థానంలో టికెట్‌ ఆశించిన మేడల మల్లికార్జున గౌడ్‌ జ్యోతి దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి తమకు ఆశ చూపి మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిట్టింగ్‌కే టికెట్‌ దక్కడంతో... స్వతంత్ర్య అభ్యర్ధిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు మేడల జ్యోతి మల్లికార్జున గౌడ్‌. దీంతో కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ బ్యానర్లు చింపేశారు.

Tags

Read MoreRead Less
Next Story