Bhadrachalam : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం.. అధికారుల అలెర్ట్...

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద నీటిమట్టం ప్రమాదకరంగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదీ తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. గోదావరిలో ప్రస్తుతం 9,40,345 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో భద్రాచలంలోని స్నానఘట్టాలు పూర్తిగా నీట మునిగాయి, వరద నీరు కళ్యాణకట్టను తాకుతున్న నేపథ్యంలో భక్తులు నదిలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పర్ణశాలలోనూ వరద ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పర్ణశాలలోని సీతమ్మ నారచీరల ప్రాంతం, సీతమ్మ విగ్రహం వరద నీటిలో మునిగిపోయాయి.
మరోవైపు, తుంగభద్ర జలాశయానికి కూడా భారీగా వరద పోటెత్తింది. ప్రాజెక్టుకు 1,28,453 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, అధికారులు 26 గేట్లను ఎత్తి 1,30,715 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి, తుంగభద్ర నదులకు వరద ఉద్ధృతి కొనసాగుతుండటంతో అధికారులు పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com