Telangana : డాక్టర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఆ పోస్టులకు సెలక్షన్ లిస్ట్ రిలీజ్

డాక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఆయుష్ మెడికల్ ఆఫీసర్, ఎంఎన్జే హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ లిస్ట్ను శనివారం విడుదల చేసింది. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు 156 ఉండగా, ఎంఎన్జేలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 45 ఉన్నాయి. ఈ పోస్టులకు ఎంపికైన వారి వివరాలను బోర్డు ఇవాళ ప్రకటించింది. ఈ పోస్టుల భర్తీతో ఆయుష్ వైద్య సేవలు మరింత మెరుగు అవుతాయని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆయుష్ వైద్య సేవలను బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.
ఆయుష్లో ఇటీవలే సుమారు 630 వరకు యోగా ఇన్స్ట్రక్టర్లను నియమించామని, మరో 200లకు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చామని మంత్రి అన్నారు. కేన్సర్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేన్సర్ వైద్య సేవలను విస్తరిస్తున్నామని తెలిపారు. కొత్తగా 45 మంది డాక్టర్ల నియామకంతో ఎంఎన్జే కేన్సర్ హాస్పిటల్లో వైద్య సేవలు మరింత మెరుగు అవుతాయన్నారు. జిల్లాలకు కూడా ప్రభుత్వ కేన్సర్ వైద్య సేవలను విస్తరిస్తున్నామని.. కొత్త జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కేన్సర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో రీజనల్ కేన్సర్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఈ సెంటర్లు అందుబాటులోకి వచ్చాక, పేషెంట్లు హైదరాబాద్ వరకు రావాల్సిన అవసరం ఉండదని.. జిల్లా స్థాయిలోనే మెరుగైన వైద్య సేవలు అందుతాయని స్పష్టం చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com