Harish Rao : 9 నెలల్లో సిద్దిపేటకు రూపాయి ఇవ్వలేదు : హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 9 నెలల కాలంలో సిద్దిపేట అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయక పోగా...రూ. 150 కోట్లతో నిర్మిస్తున్న వెటర్నరీ కాలేజీని గద్దలా తన్నుకుపోతున్న సీఎం రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) తీరును ప్రజలు గమనించాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ( Harish Rao ) అన్నారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 151 మంది లబ్దిదారులకు ఆదివారం ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ... బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ ఆశీస్సులతో సిద్దిపేట నియోజక వర్గాన్ని రాష్ట్రంలోనే బెస్ట్ నియోజక వర్గంగా తీర్చిదిద్దుకున్నట్లు తెలిపారు. రూ.150 కోట్లతో సగం నిర్మాణం పూర్తయిన వెటర్నరీ కాలేజీని సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ కు తరలించుకుపోయిండని మండిపడ్డారు. కొడంగల్ నియోజక వర్గంలో అవసరమైతే కొత్త కాలేజీని మంజూరు చేయించుకోవాలి కానీ సిద్దిపేట వెటర్నరీ కాలేజీ తరలించుకొని వెళ్లడం అన్యాయం అన్నారు. 9 నెలలుగా కోమటి చెరువు శిల్పారామం పనులు ఆగిపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com