Harish Rao : సిధారెడ్డికి హరీశ్ సన్మానం.. అందాల పోటీలపై హాట్ కామెంట్స్

Harish Rao : సిధారెడ్డికి హరీశ్ సన్మానం.. అందాల పోటీలపై హాట్ కామెంట్స్
X

తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేయడానికి నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తే.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచ సుందరీమణుల పోటీలు పెడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు విమర్శించారు. సిధారెడ్డి సామర్థ్యం తెలుసుకొని కేసీఆర్ తెలంగాణ సాహిత్య అకాడమి నెలకొల్పి దానికి మొదటి అధ్యక్షుడిగా నియమించారని తెలిపారు. ఆయన నేతృత్వంలోనే ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతో గొప్పగా, విజయవంతంగా జరిగాయనిసభతో ప్రభుత్వానికి, తెలంగాణకు ఎంతో పేరు తెచ్చిపెట్టిందన్నారు. ఆదివారం మాసబ్ ట్యాంకులోని పార్క్ కాంటినెంటల్ హోటల్లో నిర్వహించిన ప్రముఖ రచయిత నందిని సిధారెడ్డి 70 ఏళ్ళలో ప్రవేశించిన సందర్భంగా నిర్వహించిన ఏడు పదుల వెన్నెల సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డెబ్భై ఏళ్లు పూర్తి చేసుకున్న సిధారెడ్డికి శుభాకాంక్షలు. ఆయనతో తనకున్న రెండు దశాబ్దాలకు పైబడిన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిధారెడ్డి తన కవిత్వంతో, సామాజిక కృషితో తెలంగాణ సమాజం మీద ప్రభావం చూపించారన్నారు. నమ్మిన విషయాల పట్ల నిజాయితీగా, నిబద్ధతతో ఉంటారని తెలిపారు. తెలంగాణ ఉద్యమం కోసం తన ప్రమోషన్ సైతం వదులుకున్న మహనీయుడని చెప్పారు. సిధారెడ్డి ఎలాంటి ప్రలోభాలకు లోంగరని, ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం కోటి రూపాయలు, 300 గజాల స్థలం ఇస్తామని చెబితే తిరస్కరించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు కాబట్టే అవార్డు వెనక్కి పంపారని చెప్పారు. కాంగ్రెస్ ఇవ్వాలని అనుకున్న అవార్డును తిరస్కరించడంతో సిధారెడ్డి వ్యక్తిత్వం ఆకాశమంత ఎత్తుకెదిగిందని పేర్కొన్నారు. అందుకే ఆయన కవిత్వం, వ్యక్తిత్వం అంటే ఎంతో ఇష్టమని వ్యాఖ్యానించారు.

Tags

Next Story