Karnataka : 2028లోపు సీఎం అవుతా : హెచ్.డి. కుమారస్వామి

దేవెగౌడ కుమారుడు, కేంద్ర మంత్రి హెచ్.డి.కుమారస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. 2028లోపు తాను మళ్లీ కర్ణాటక ముఖ్యమంత్రి అవుతానని పేర్కొన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో నెలకొంటున్న అంతర్గత కలహాల కారణంగా ఈ ప్రభుత్వం పతనమవుతుందని జోస్యం చెప్పారు. ప్రజలు కోరుకుంటే తాను ముఖ్యమంత్రిని అవుతానని.. వారు తనకు మరో అవకాశం ఇస్తారని నమ్ముతున్నానని కుమారస్వామి అన్నారు. 2028లోపు వారి మద్దతుతో సీఎంగా బాధ్యతలు చేపట్టి, మరింత అద్భుతంగా పని చేస్తానని పేర్కొన్నారు. గతంలో కర్ణాటక సీఎంగా తాను చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని.. ఆ పార్టీ ఎమ్మెల్యేలే దానిని పడగొడతారని కుమారస్వామి అన్నారు. ‘రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో ప్రజలు ఎమ్మెల్యేల పట్ల ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ప్రభుత్వ నేతల్లో రోజురోజుకు అసంతృప్తి పెరిగిపోతోంది. దీని వల్ల పార్టీకి నష్టం పొంచి ఉంది. ఈ విభేదాలు త్వరలోనే బయటకు వస్తాయి. అప్పటి వరకు వేచి చూడాల్సిందే’ అని ఆయన వ్యాఖ్యానించారు. 2006 - 2007, 2018 మే నుంచి 2019 జూలై వరకు కుమారస్వామి రెండుసార్లు ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. ప్రస్తుతం కేంద్ర ఉక్కుశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com