TG : పొలం, డబ్బు ఆశచూపి కిడ్నీ తీసుకున్న ఘటనపై ఆరోగ్య మంత్రి దామోదర సీరియస్

ఓ రైతుకు పొలం, డబ్బు ఆశ చూపి అతడి నుంచి కిడ్నీ తీసుకున్న ఘటనపై సమగ్ర విచారణ జరిపించి నివేదిక అందజేయాలని ఉన్నతాధికారులను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశించారు. ఈ విషయమై మీడియాలో వస్తున్న కథనాలపై ఆదివారం ఆయన స్పందించారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని రాజోలు గ్రామ శివారు పోలంపల్లి తండాకు చెందిన గిరిజన రైతు ధరావత్ చిట్టిబాబుకు పొలం, డబ్బు ఆశ చూపి అతని కిడ్నీ తీసుకున్న ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్తో ఫోన్లో మాట్లాడి తక్షణమే విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు, వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. కాగా.. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో దారుణం జరిగింది. పొలం కొనిస్తాం.. డబ్బులు కూడా ఇస్తామంటూ ఆశ చూపి ఓ గిరిజనుడి నుంచి కిడ్నీ తీసుకున్నారు. కిడ్నీ ఇచ్చిన తరువాత అతనికి సరియైన ట్రీట్మెంట్ ఇప్పించకపోవటంతో ప్రస్తుతం ఆ గిరిజనుడి ఆరోగ్యం విషమించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com