TG : రేపు, ఎల్లుండి వడగళ్ల వాన గండం!

రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలతోపాటు ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికలు రైతులను తీవ్ర ఆందోళనలోకి నెట్టాయి. ఈ సమయంలో వడగళ్లు, భారీ వర్షాలు, ఈదురుగాలలు సంభవిస్తే వరిచేలు గింజ నేలరాలడంతోపాటు వరిపైరు నేలవాలు తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. రానున్న మూడు రోజుల్లో పలు జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని.. రాబోయే మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, ఆ తర్వాత మళ్లీ పెరిగేందుకు అవకాశం ముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయంటూ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
శుక్రవారం ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన వర్షాలు పడుతాయని హెచ్చరించింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయగా.. నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆదివారం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ వడగళ్ల వానలు పడుతాయని తెలిపింది. మరికొన్ని ఉరుములు, మెరుపులతో పాటు పెనుగాలులు వీస్తాయని హెచ్చరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com