Warangal : వరంగల్ లో వర్ష బీభత్సం....జల దిగ్బంధంలో పలు కాలనీలు...

Warangal : వరంగల్ లో వర్ష బీభత్సం....జల దిగ్బంధంలో పలు కాలనీలు...
X

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. గడిచిన 24 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అతలాకుతలమైంది. భారీ వర్షాలతో వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో పాటు రోడ్ల పైకి వరద నీరు చేరడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నిన్న ఒక్క రాత్రే 21 సెంటి మీటర్ల వర్ష పాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

వరంగల్ నుంచి ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు భారీగా నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సంగెం మండలంలో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం కురవగా, ఖిల్లా వరంగల్‌లో 14.8, వర్ధన్నపేటలో 12 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడినట్టు అధికారులు తెలిపారు. దీంతో పలు కాలనీలు నీటిలో మునిగిపోయాయి. హనుమకొండ బస్టాండ్ , హనుమకొండ చౌరస్తా, గోకుల్ నగర్ ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోయింది. వరంగల్ నగరంలోని బట్టల బజార్, పాత బీటు బజార్ , కరీమాబాద్‌లోని అనేక కాలనీలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఉర్సుగుట్ట సమీపంలోని డీకే నగర్‌లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అక్కడి గుడిసెవాసులను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించారు. వర్ష ప్రభావం కొనసాగనుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

Tags

Next Story