Heavy Rainfall : తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

తెలంగాణలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి, దీని ప్రభావంతో జనజీవనంపై తీవ్ర ప్రభావం పడింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. హైదరాబాద్లో కురుస్తున్న వర్షాల వల్ల హిమాయత్ సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో మూసీ నదికి వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రాష్ట్రంలోని ఎల్లంపల్లి, సింగూరు, మరియు ఇతర ప్రాజెక్టులలోకి భారీగా వరద వస్తుండటంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా కొన్ని జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అల్పపీడనం ప్రభావంతో వరద ముంపునకు గురయ్యే అవకాశమున్న లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com