TG : రేవంత్, కేటీఆర్ పై కేసులు కొట్టివేసిన హైకోర్టు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. మాజీ మంత్రి కేటీ రామారావు జన్వాడ ఫామ్ హౌస్ పై డ్రోన్ ఎగుర వేశారంటూ రేవంత్ రెడ్డితో పాటు మరికొంత మందిపై రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్లో 2020 సంవత్సరం మార్చి మాసంలో కేసు నమోదైంది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు. దీంతో ఎఫ్ఎస్ఐఆర్ ను కొట్టివేయాలని రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ జన్వాడ నిషేధిత ప్రాంతమేమీ కాదని, సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు సెక్షన్లు నమోదు చేశారని ధర్మాసనానికి తెలిపారు. డ్రోన్ ఎగురవేసిన ప్రాంతం ఎటువంటి నిషేధిత జాబితాలో లేదని పీపీ న్యాయస్థానానికి వివరించారు. దీంతో పూర్తి వాదనలు విన్న న్యాయస్థానం నార్సింగి పీఎస్ లో సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన పిటిషన్ ను కొట్టివేస్తూ ఉత్తర్వులను వెలువరించింది.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై సైఫాబాద్ పీఎస్లో నమోదైన కేసును కొట్టివేస్తూ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డిని కించపరిచే విధంగా మాట్లాడారని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. పోలీసులు ఎఫ్ఎస్ఐఆర్ ను నమోదు చేయడంతో దానిని కొట్టేయాలని మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా బాధ్యత గల హోదాలో ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడారని, సీఎంను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. రాజకీయ కక్షల కారణంగానే మాజీ మంత్రికేటీ ఆర్పై కేసు నమోదు చేశారని ఆయన తరపున న్యాయవాది వాదించారు. ఇరువైపులా వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ఎఫ్ఎస్ఐఆర్ను కొట్టి వేసింది. ఇటీవల ఫార్ములా-ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్పై తెలంగాణ ఏసీబీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. పలుమార్లు విచారణకు పిలిచి ఆయన నుంచి పోలీసు ఉన్నతాధికారులు వాంగ్ములాలను సేకరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com