Meenakshi Natarajan : మీనాక్షి నటరాజన్ చేతిలో కీలక నేతల జాతకం

తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ తో ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కాంటెస్టెడ్ ఎమ్మెల్యేలతో భేటీలు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు తమతమ డిమాండ్లను గట్టిగా నినదించారు. సాయంత్రం నుంచి రాత్రి వరకు నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని నేతలతోనూ కొంత సమయం మాత్రమే కేటాయిస్తూ సమీక్షించారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు, కాంటెస్టెడ్ అభ్యర్థులతో 'వన్ టు వన్'గా సమావేశం నిర్వహించడంతో ఎవరితో ఏం మాట్లాడారనే విషయాలు గోప్యంగా ఉన్నాయి.
ఏమైనా పదవులు ఆశిస్తున్నారా? అసంతృప్తిగా ఉన్నారా? నియోజకవర్గంలో ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఏం అనుకుంటున్నారు? ఏ రకరమైన సమస్యలు ఉన్నాయి? అనే విషయాలపై ఆరా తీశారు. మాదిగ ఎమ్మెల్యేలు మాత్రం మీనాక్షితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తమ డిమాండ్లను వెల్లడించారు. ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలతో కలుస్తామని, తమ డిమాండ్లను వారి ముందుంచుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు మందుల సామ్యూల్, కాలే యాదయ్య, కవ్వంపల్లి సత్యనారాయణ, లక్ష్మీకాంతరావు మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ గురువారం కూడా ఇదే తరహా సమీక్షలు నిర్వహించి నాయకుల అభిప్రాయాలు సేకరించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com