TG : మేడ్చల్ అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం

అక్రమ నిర్మాణాలపై హైడ్రా కన్నెర్ర జేసింది. అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతోంది. వరుస దాడులతో అక్రమ నిర్మాణాలు, కబ్జాలను కూల్చేస్తోంది. పంద్రాగస్టు సెలవు దినాన్ని కూడా లెక్క చేయకుండా బుధవారం అర్దరాత్రి ఒంటి గంట నుంచే యాక్షన్ లోకి దిగింది.
మేడ్చల్ జిల్లాలోని బాచుపల్లి సర్వే నెంబరు 134 లో.. మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎర్రకుంట చెరువు బఫర్ జోన్లలో నిర్మించిన.. బహుళ అంతస్తుల అక్రమ కట్టడాలను అధికార యంత్రాంగం నేలమట్టం చేసింది. అధికారులు పెద్ద మొత్తంలో బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్ మెంట్లను కూల్చివేస్తున్నారు.
ఎర్రకుంట చెరువులో అక్రమ నిర్మాణాలపై ఆగస్టు 1వ తేదీన హైడ్రా అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిన్న ఎర్రకుంట చెరువులో వెలిసిన నిర్మాణాలను పరిశీలించారు. అర్ద రాత్రి నుంచే కూల్చివేతలు చేపట్టాలని.. అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు. ఇందులో భాగంగా మూడు బహుళ అంతస్తులను నేలమట్టం చేశారు. భారీ భవనం నేలమట్టమవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com