Bandi Sanjay : కాంగ్రెస్ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా

దొంగ ఓట్లతో బీజేపీ నేతలు గెలిచారంటూ పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ‘‘అధికారంలోకి ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కాబట్టి వెంటనే దొంగ ఓట్ల జాబితాను బయటపెట్టండి. ఆ దొంగ ఓట్లను తొలగించాలని ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాయండి. ఆ తరువాత అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల్లో వెళ్లండి. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. దీనికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమా?’’అంటూ సవాల్ విసిరారు. పార్లమెంట్ ఎన్నికల్లో 2 లక్షల 25 వేల భారీ మెజారిటీతో గెలిపిస్తే దొంగ ఓట్లంటూ కరీంనగర్ ప్రజలను కాంగ్రెస్ అవమానిస్తోందని మండిపడ్డారు. ఈ దేశంలో 20 నెలల పాలనలో పంచాయతీలకు నయాపైసా ఇయ్యని పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమేనని విమర్శించారు. పంచాయతీలకు అప్పుడైనా, ఇప్పుడైనా నిధులిస్తోంది కేంద్ర ప్రభుత్వమేనన్నారు. ఆ కేంద్ర నిధుల కోసమే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించుకుంటున్నారే తప్ప ఎన్నికలు జరపాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ కు లేనేలేదని అన్నారు. ఈరోజు కరీంనగర్ వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ను మీడియా ప్రతినిధులు కలిసి మహేశ్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా స్పందిస్తూ మహేశ్ గౌడ్ పైనా, కాంగ్రెస్ నేతలపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com