TG : విచారణ కమిషన్ కొత్త చైర్మన్.. ఎవరీ లోకూర్?

తెలంగాణలో విద్యుత్ విచారణ కమిషన్ కొత్త చైర్మన్గా జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ నియమితులయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర సర్కారు కొత్త చైర్మన్ను నియమించింది. ఇంతకు ముందు కమిషన్ చైర్మన్గా జస్టిస్ నరసింహారెడ్డి వ్యవహరించారు.
చత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు... యాదాద్రి, భద్రాద్రి సబ్క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ కు చైర్మన్గా జస్టిస్ ఎల్.నరసింహారెడ్డిని నియమించింది. విచారణ జరుగుతున్న సమయంలో.. కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడాన్ని, చైర్మన్ నిష్పాక్షికతను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్.. కమిషన్ చైర్మన్ను మార్చాలని ఆదేశించింది. దీంతో కమిషన్ చైర్మన్ పదవి నుంచి వైదొలగుతున్నట్లు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి తన రాజీనామా లేఖను న్యాయవాది ద్వారా సుప్రీంకోర్టుకు సమర్పించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొత్త చైర్మన్ను నియమిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. మంగళవారం నూతన చైర్మన్గా జస్టిస్ మదన్ బి.లోకూర్ను నియమించింది.
విద్యుత్ కమిషన్ నూతన చైర్మన్ గా నియమితులైన జస్టిస్ బీ లోకూర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు సీజేగా, ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశారు.1953 డిసెంబర్ 31న జన్మించిన ఆయన.. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్ లా నుంచి తన న్యాయశాస్త్ర పట్టా పొందారు. ఉమ్మడి ఏపీతోపాటు గౌహతి, ఢిల్లీ హైకోర్టులకు న్యాయమూర్తిగా పనిచేశారు. 2018డిసెంబర్ లో సుప్రీంకోర్టు సీనియర్ మోస్ట్ జడ్జిగా పదవీ విరమణ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com