KCR - KTR : కేసీఆర్ - కేటీఆర్ సుదీర్ఘ భేటీలో చర్చించిన అంశాలు ఇవే

KCR - KTR : కేసీఆర్ - కేటీఆర్ సుదీర్ఘ భేటీలో చర్చించిన అంశాలు ఇవే
X

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు పలు అంశాలపై ఆదివారం మంతనాలు జరిపారు. కేసీఆర్ కుమార్తె కవిత ఇటీవల రాసిన లేఖతో దుమారం చెలరేగిన నేపథ్యంలో తండ్రి- తనయుని భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఆదివారం మధ్యాహ్నం కేటీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్ కు వెళ్ళి తండ్రిని కలిసారు. ఇరువురూ సుమారు రెండున్నర గంటల పాటు వివిధ అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ముఖ్య భూమిక బీఆర్ఎస్సే పోషించింది కాబట్టి జూన్ 2న పార్టీ యావత్తు పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి పార్టీశ్రేణులకు దిశా నిర్దేశం, కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలని వారు భావించారు. అధికారంలో ఉన్నప్పుడు గ్రామ, పట్టణాల్లో పార్టీ జెండాలతో పాటు త్రివర్ణ పతాకాలు ఎగురవేసినట్లు రక్తదాన శిబిరాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పండ్ల పంపిణీ వంటి కార్య మాలు నిర్వహించినట్లు ఇప్పుడూ అంతే ఆర్భాటంగా నిర్వహించాలని వారు నిర్ణయించారు.

పార్టీ ముఖ్యులతో సోమవారం చర్చించి కార్యా చరణ ప్రకటిస్తానని కేటీఆర్ అన్నారని, దీనికి కేసీఆర్ కూడా పలు సూచనలు చేశారని తెలిసింది. ఇదే సమయంలో కేటీఆర్ 28న వెళ్ళనున్న డాలస్ పర్యటన గురించి తండ్రికి చెప్పారు. జూన్ 1న అక్కడ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనేందుకు కేటీఆర్ డాలస్ వెళ్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ చేపట్టిన పీసీ ఘోష్ కమిషన్ పంపించిన నోటీసు గురించి కేటీఆర్ ప్రస్తావించగా, ఆ సంగతి తాను చూసుకుంటానని కేసీఆర్ అన్నారని సమాచారం. దీనిపై ఇంకా న్యాయ నిపుణులతో చర్చించనున్నట్లు ఆయన కేటీఆర్ అన్నారు. ఈ వ్యవహారంతో మనేమేమీ గాబరా పడాల్సిన అవసరం లేదనీ, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహారిస్తున్నదన్న భావన వారికి ఏర్పడిందని కేసీఆర్ ఆయనతో అన్నారని పార్టీవర్గాల ద్వారా తెలిసింది. ఎర్రవల్లిలోని ఫాం హౌస్ లో తండ్రి-తనయుడు భోజనం చేస్తూ మాట్లాడుకున్నారని, భోజనానంతరం మళ్ళీ రెండు గంటల పాటు మంతనాలు జరిపారని తెలిసింది.

Tags

Next Story