ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ బహిరంగ సభ..ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్

గ్రేటర్ ఎన్నికల ప్రచారంతో హైదరాబాద్ హోరెత్తుతోంది. ఇందులో భాగంగా ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ జరగనుంది. గ్రేటర్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటున్న ఏకైక సభ కావడంతో.. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీఆర్ఎస్. ఈ సభకు దాదాపు రెండు లక్షల మందికి పైగా సమీకరించనున్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. బీజేపీ విమర్శలకు కేసీఆర్ ధీటుగా బదులిస్తారని గులాబీ శ్రేణులు అంటున్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్ అభివృద్ధి, ఈ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే ఐదేళ్లలో ఏం చేస్తామన్న అంశంపై కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారు.
సాయంత్రం 4 గంటలకు కేసీఆర్ ప్రచార సభ ప్రారంభమవుతుంది. 3 గంటల్లోపు ఎల్బీ స్టేడియానికి చేరుకునేలా . జనసమీణకరణ చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. కొవిడ్ నిబంధనలకు లోబడి సభ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 2 లక్షల మాస్క్లు, శానిటైజర్లను పంపిణీ చేస్తున్నారు. ట్యాంకు బండ్ నుంచి గేట్- జీ, ఎల్బీనగర్, దిల్షుక్నగర్ నుంచి వచ్చే జనం కోసం గేట్ -ఏ, ముషీరాబాద్, అంబర్పేట నుంచి గేట్ -ఎఫ్ ద్వారా స్టేడియంలోపలకి అనుమతిస్తున్నారు. అటు ట్రాఫిక్ సైతం కంట్రోల్ చేస్తున్నారు. ఏర్పాట్లను మంత్రి తలసాని యాదవ్, కర్నె ప్రభాకర్ తదితరులు తదితరులు పర్యవేక్షిస్తున్నారు.
ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల ఉండే గోషామహల్, ఖైరతాబాద్, అంబర్పేట, ముషీరాబాద్ తదితర అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి నుంచి పాదయాత్రలుగా జనాన్ని తరలించున్నారు. స్టేడియంలో మూడు వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై నుంచి కేసీఆర్ ప్రసంగిస్తారు. అదే వేదికపై మంత్రులు, జీహెచ్ఎంసీ పరిధిలోని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూర్చుంటారు. కుడి వైపున కళాకారుల ప్రదర్శనల కోసం ఒక వేదిక, ఎడమ వైపున 150 డివిజన్ల నుంచి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్ధుల కోసం మరో వేదిక రెడీ చేశారు. స్టేడియం లోపల, వెలుపల భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేస్తున్నారు.
సాయంత్రం 4 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో సభ మొదలు కానుంది. కేసీఆర్ ప్రసంగం అనంతరం.. 6 గంటలకు సభను ముగించేలా షెడ్యూల్ ఖరారు చేశారు. అంతా పకడ్బందీగా జరిగేలా ఏర్పాట్లు చేశారు గులాబీనేతలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com