Jurala Project : కృష్ణమ్మ పరవళ్లు.. నిండుకుండలా జూరాల

Jurala Project : కృష్ణమ్మ పరవళ్లు.. నిండుకుండలా జూరాల
X

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిలోకి వరద నీరు వచ్చి చేరడంతో జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. శుక్రవారం జూరాల ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి 20,155 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. దీంతో కృష్ణమ్మ శ్రీశైలం డ్యాం వైపు పరుగులు తీస్తోంది. కృష్ణానదికి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకుని జూరాల జల విద్యుత్ కేంద్రంలో 3 యూనిట్ ల ద్వారా విద్యుత్తుత్పత్తి ప్రారంభించినట్లు జెన్ కో అధికారులు తెలిపారు. అదే విధంగా జూరాల ఆయకట్టు పై ఆధారపడిన కుడి, ఎడమ కాలువలతో పాటు నెట్టెంపాడు. ఎత్తిపోతలకు నీటిని విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రానికి జూరాల జలాశయంలో 9.657 టీఎంసీలు పూర్తిస్థాయి నీటిమట్టం ఉండగా ప్రస్తుతం 7.627 టీఎంసీల నీరు నిల్వ ఉంది. విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం.. జూరాల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి వరద వస్తుండటంతో జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో మూడు యూనిట్ ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించగా విద్యుత్ ఉత్పత్తికి 16,975 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి జలకళ ఉట్టిపడుతోంది. ముఖ్యంగా శ్రీశైలం డ్యామ్కు ఎగువ జూరాల నుంచి సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం మేరకు 78,509 క్యూసెక్కులు, సుంకేసుల బ్యారేజ్ 4,345 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతున్నాయి. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. కాగా ప్రస్తుత నీటిమట్టం 821.90 అడుగులుగా ఉంది. ఇక జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలకు గాను, ప్రస్తుత నీటి నిల్వ 42.277 టీఎంసీలుగా ఉంది.

Tags

Next Story