భూముల విలువ పెంచుతూ..తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Land registration values
Land registration values: తెలంగాణలో భూముల విలువ పెరిగింది. భూముల విలువ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీలు 6శాతం నుంచి 7.5 శాతానికి పెంచింది. రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెల 22 నుంచి కొత్తగా పెంచిన రుసుంలు అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయేతర భూములు, ఇతర ఆస్తుల విలువ గరిష్ఠంగా 50 శాతం పెరగనున్నాయి.ఇక ప్రాంతాల వారీ విలువ ఆధారంగా ఇవి 20 నుంచి 40 శాతం మేర పెరగనున్నాయి.
ఇక దీనికి సంబంధించిన తదుపరి చర్యలను తీసుకోవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ను సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఈ క్రమంలో సాగుభూములు గరిష్ఠ, కనిష్ఠ విలువల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. నాన్ అగ్రీకల్చరల్ లాండ్స్ విలువను ఇప్పటి కన్నా 50 శాతం అధనంగా పెంచాలని రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ఇక మరో 20 రకాల సేవలపై విధించే రుసుంలు పెంచనున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక భూముల విలువ, రిజిస్ట్రేషన్ రుసుంలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com