TG Local Elections : ఆగస్ట్ లో స్థానిక ఎన్నికలు.. సీఎం రేవంత్ సంకేతాలు

స్థానిక సంస్థల ఎన్నికలను జూలై, ఆగస్టు నెలలలో పూర్తి చేద్దామని తనను కలిసిన ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జూన్ చివరి వారం నుండి వరుసగా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి, మునిసిపాలిటీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించి.. నోటిఫికేషన్ విడుదల చేద్దామని, జూలై చివరి వారం నుండి ఆగస్టు మొదటి వారంలోపు ఎన్నికలను పూర్తి చేసేందుకు పార్టీ శ్రేణులను పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సన్నద్ధం చేయాలని నిర్దేశించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని నిర్దేశించారు.
సాధ్యమైనంత త్వరలో నాలుగు ఎకరాల లోపు పొలం ఉన్న రైతులకు రైతు భరోసా డబ్బులను వారి ఖాతాలలో వేసి, మిగతా నాలుగు ఎకరాలకు పైబడి ఉన్న రైతులకు జూన్ రెండు లేదా మూడవ వారం లోపు రైతు భరోసా డబ్బులు వేసేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) ట్రిపుల్ ఐటీ కొత్త క్యాంపస్ ను మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్రెడ్డికి ఆ జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు గురువారం సీఎంను జూబ్లిహిల్స్లోని ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డికి శాలువా కప్పి సన్మానించారు. అనంతరం కాసేపు ఎమ్మెల్యేలతో సీఎం ముచ్చటించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళదామా..? అని సీఎం అడగడంతో సంక్షేమ పథకాల అమలు పట్ల ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని, ప్రధాన రాజకీయ ప్రతిపక్ష పార్టీలు పలు కారణాలతో డీలా పడిపోయి ఉన్నాయని, ఎన్నికలకు వెళితే మనం స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలో పార్టీ ఘనవిజయం సాధించే అవకాశాలు ఉంటాయని ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మె ల్యేలు ముఖ్యమంత్రికి చెప్పినట్టు సమాచారం. ఉమ్మడి జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం అవుతున్న తీరు, జిల్లాలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com