Supreme Court : తెలంగాణ వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికత తప్పనిసరి.

తెలంగాణలో వైద్య విద్య చదవాలనుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన నాలుగేళ్ల స్థానికత నిబంధనను సుప్రీంకోర్టు సమర్థించింది. తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదివిన విద్యార్థులనే స్థానికులుగా పరిగణించాలన్న నిబంధన సరైనదే అని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీనితో తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై జారీ చేసిన జీవోకు చట్టబద్ధత లభించినట్టయింది.
గతంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి, డివిజన్ బెంచ్లు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు ధర్మాసనం పక్కనపెట్టింది. ఈ అంశంపై గత కొంతకాలంగా న్యాయ పోరాటం కొనసాగుతోంది. రాష్ట్రంలో పుట్టి, పెరిగి, కొంత కాలం ఇతర రాష్ట్రాల్లో చదువుకున్న విద్యార్థులకు స్థానిక కోటాలో అవకాశం లేకుండా పోయిందని పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
అయితే, స్థానిక విద్యార్థుల ప్రయోజనాలను కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ నిబంధనను తీసుకొచ్చినట్లు ప్రభుత్వం కోర్టులో వాదించింది. ఈ వాదనను సమర్థించిన సుప్రీంకోర్టు, తెలంగాణ ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. ఈ తీర్పుతో రాష్ట్రంలోని 85శాతం స్థానిక కోటా సీట్లలో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ తీర్పు తెలంగాణలో వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియపై స్పష్టతనిచ్చింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com