TG: కాంగ్రెస్పై మల్లారెడ్డిది అసత్య ప్రచారం

మేడ్చల్-మల్కాజిగిరి పరిధి సుచిత్రలోని వివాదాస్పద భూమిపై ప్రభుత్వ విప్, ధర్మపురి MLA అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. సుధామ అనే వ్యక్తి నుంచి 2015లో భూమి కొనుగోలు చేశామని ఆయన స్పష్టం చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కావాలనే కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. సుచిత్రలోని వివాదాస్పద భూమిలో బందోబస్తు మధ్య అధికారులు సర్వే నిర్వహించారు. హైదరాబాద్ పేట్ బషీర్బాద్ PS పరిధిలోని సుచిత్రలో సర్వే నెంబర్ 82 కు సంబంధించిన రెండున్నరెకరాల భూమి మాదంటే మాదని మాజీమంత్రి మల్లారెడ్డి, అవతలి వర్గం వారు వాదిస్తున్నారు. తమ భూమిలో అక్రమంగా ఫెన్సింగ్ వేశారంటూ మల్లారెడ్డి అనుచరులు.. కంచెను కూల్చడం ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదులతో ఉద్రిక్తతలకు దారితీయగా.. రంగంలోకి దిగిన అధికారులు సర్వే నెంబ.82లో భూమిలో సర్వే చేపట్టారు. బందోబస్తు మధ్య యంత్రాంగం సరిహద్దులు గుర్తించే పనిలో పడ్డారు.
సర్వే నంబర్ 82లో ఉన్న భూమి మొత్తం తమదేనని మంత్రి మల్లారెడ్డి చెబుతున్నారు. అందుకు సంబంధించి ఆధారాలన్నీ తమవద్ద ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. ఇదే అంశంపై ప్రభుత్వ విప్, ధర్మపురి MLA అడ్లూరి లక్ష్మణ్ స్పందించారు. తనతోపాటు ఆరుగురు కలిసి సుధామ నుంచి 2015లో సదరు భూమి కొనుగోలు చేసినట్లు స్పష్టంచేశారు. మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డిని కలిసి భూవివాదాన్ని సెటిల్ చేయాలని అడగ్గా.. వారు కనీసం స్పందించలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన లక్ష్మణ్.. తన నిజాయితీని ముఖ్యమంత్రి వద్ద నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.
అసలేం జరిగిందంటే..
మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలకు మరో 15 మందికి మధ్య తలెత్తిన భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హైదరాబాద్ శివారు సుచిత్రలోని 82 సర్వే నెంబర్లో గల భూమి తమదంటే తమదని ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది. కోర్టులో ఉన్న భూమికి సంబంధించి అందులోని షెడ్లు, ఫెన్సింగ్ ధ్వంసం చేయడం ఘర్షణకు దారితీసింది. భారీ బందోబస్తు నడుమ పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. హైదరాబాద్ పేట్ బషీర్బాద్ పీఎస్ పరిధిలోని సుచిత్రలో సర్వే నెంబర్ 82 కు సంబంధించిన రెండున్నర ఎకరాల భూమి విషయంలో మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు మరో 15 మంది మధ్య భూ వివాదం నెలకొంది. హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లోని భూమిలో అక్రమంగా ఫెన్సింగ్ వేశారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులతో... అక్కడకు వచ్చారు. ఫెన్సింగ్ను కూల్చాలంటూ అనుచరులను పురమాయించారు. ఇదే సమయంలో ఆ భూమి తమకే చెందుతుందని మరో 15మంది ఘర్షణకు దిగారు. తమకు అనుకూలంగా కోర్టు తీర్పు ఉందని వారు వాదించగా... భూమిని సర్వే చేసి నిజాలు నిగ్గుతేల్చాలని మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఇరువర్గాలు వెనక్కి తగ్గకపోవడం ఉద్రిక్తతలకు దారితీసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com