TG : మెట్రో పొలిస్ హోటల్ యజమాని, మేనేజర్ అరెస్ట్

మెట్రో పొలిస్ హోటల్ యజమాని రషీద్, మేనేజర్ రెహమాన్ను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు మునావర్ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. రషీద్ను ముంబయిలో అరెస్టు చేసినట్టు చెప్పారు. వ్యక్తిత్వ వికాసం పేరుతో యువకులకు క్లాసులు నిర్వహించిన మునావర్ .. యువకులను రెచ్చగొట్టినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. మత విద్వేషాలకు వేదికగా నిలుస్తోందంటూ పోలీసులు చేసిన సిఫారసు మేరకు సికింద్రాబాద్లోని మెట్రో పొలిస్ హోటల్ను ఇప్పటికే రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఇక్కడికి వ్యక్తిత్వ వికాస శిక్షణ కోసం వచ్చిన ఓ వ్యక్తి అక్కడి వారి ప్రసంగాలకు ప్రేరేపితుడై ఇటీవల కుమ్మరిగూడలోని ఓ ప్రార్థన మందిరంపై దాడి చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో హోటల్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ప్రాథమికంగా లభ్యమైన ఆధారాల ప్రకారం మెట్రో పొలిస్ హోటల్ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వేదికగా మారిందని, పోలీసుల అనుమతులు లేకుండా నెలరోజులుగా అక్కడ మత విద్వేష ప్రసంగాలు జరిగినట్టు తేలిన నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని ఉత్తర మండలం డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్, సికింద్రాబాద్ ఆర్డీవోకు సిఫారసు చేశారు. దీంతో సికింద్రాబాద్ తహసీల్దార్ పాండునాయక్, పోలీసు అధికారులతో కలిసి గురువారం హోటల్ను సీజ్ చేశారు. గదుల్లో ఉన్న వారిని ఖాళీ చేయించారు. హోటల్లోని రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com