TG : రెండేళ్లలో రిజిస్ట్రేషన్ ఆఫీసులకు సొంత భవనాలు : మంత్రి పొంగులేటి

రెండేళ్లలో రిజిస్ట్రేషన్ ఆఫీసులకు సొంత భవనాలు నిర్మిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా సేవలు అందించాలని అధికారులకు ఆయన సూచించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉద్యోగులతో ఆదివారం జూబ్లీహిల్స్ లోని ఎంసీహెచ్ఆర్డీలో మంత్రి పొంగులేటి సమావేశమయ్యారు. ఆఫీసుల అద్దెలు, విద్యుత్ ఛార్జీలు, అద్దె వాహనాల ఛార్జీలు మొదలైన వాటికి అవసరమైన బిల్లులు త్వరలోనే క్లియర్ చేస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. రిజిస్ట్రేషన్ శాఖకు శాశ్వత ప్రభుత్వ భవనాల ఇంపార్టెన్స్ ను మంత్రి ప్రస్తావిస్తూ.. త్రిముఖ వ్యూహాన్ని రూపొందిస్తున్నామన్నారు. అన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసులు రెండేళ్లలో ప్రభుత్వ భవనాల్లో పనిచేయడం ప్రారంభిస్తాయన్నారు. ఇతర రాష్ట్రాల్లోని రిజిస్ట్రేషన్ శాఖల్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసులను మన రాష్ట్రంలో కూడా పాటించేలా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించేందుకు వీలుగా కొత్త టెక్నాలజీలను అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు. 2014లో రూ.2,746 కోట్లుగా ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం గతేడాది రూ.14,588 కోట్లకు చేరుకుందని ప్రభుత్వ కార్యదర్శి, స్టాంపులు రిజిస్ట్రేషన్ల కమిషనర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి వివరించారు. రిజిస్ట్రేషన్ శాఖ పనితీరుపై ఆయన మంత్రికి వివరణ ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com