Minister Ponguleti Srinivasa Reddy : పల్లెల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి పొంగులేటి

పల్లెల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. కూసుమంచి మండలంలో ఆదివారం విస్తృతంగా పర్యటించారు. తొలుత పాలేరులో సైడ్ డ్రెయిన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం తురకగూడెం నుంచి కిష్టాపురం వరకు, తురకగూడెం నుంచి చింతల తండా వరకు రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి ఆయా గ్రామాల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. పల్లెల్లో మురుగునీటి సమస్య లేకుండా చూస్తామని తెలిపారు. ఇందుకోసం సీసీ, బీటీ రోడ్ల వెంట, వీధుల్లో పూర్తిస్థాయిలో డ్రైనేజీలు నిర్మిస్తామని అన్నారు. పారిశుధ్ధ్య సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని, తమది మాటల ప్రభుత్వం కాదని చేతల్లో చేసి చూపుతున్నామని అన్నారు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలను వర్తింప చేస్తామని ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com