BJP: కిషన్ రెడ్డికి బిగ్ టాస్క్...

ప్రధాని మోదీ వరంగల్ సభ రూపంలో బీజేపీ నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డికి బిగ్ టాస్క్ వచ్చింది. అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన నాలుగు రోజులకే భారీ బహిరంగ సభ నిర్వహించాల్సి రావడంతో.. దాన్ని విజయవంతం చేసేందుకు కిషన్ రెడ్డి సర్వశక్తుల్ని ఒడ్డుతున్నారు. రెండు లక్షల మంది జన సమీకరణే లక్ష్యమంటున్నారు. వరంగల్ సభతో బీజేపీకి లాభం లేదంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ విమర్శల నేపథ్యంలో అలాంటి చోటే భారీగా జన సమీకరణ చేసి చూపుతామంటున్నారు కిషన్ రెడ్డి.ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్యాలయంలో ఛార్జ్ తీసుకోకముందే కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు.నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకోగానే రాష్ట్ర పదాదికారుల సమావేశం నిర్వహించారు.ఇవాళ హైదరాబాద్ జిల్లా డివిజన్ అధ్యక్షులతో సమావేశమవుతున్నారు.అటు బీజేపీ నేతలు ఇవాళ్టి నుంచి వరంగల్లోనే మకాం వేయనున్నారు.
గత ఏడాదిన్నరగా బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ 18 భారీ బహిరంగ సభలు నిర్వహించింది. ఆ సభలన్నీ సక్సెస్ అయ్యాయంటున్నారు బీజేపీ నేతలు.వరంగల్ మోదీ సభతో కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులపై బీజేపీ మరోసారి క్లారిటీ ఇవ్వనుంది. ఇప్పటికే కేంద్రం నిధులపై కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. వరంగల్ సభ విజయవంతం చేసేందుకు పని విభజన చేసిన కిషన్ రెడ్డి వరంగల్ జిల్లాలో నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లుగా సీనియర్ నేతలను నియమించారు. వరంగల్ వెస్ట్కు బండి సంజయ్కు ఇన్ఛార్జ్గా బాధ్యతలిచ్చారు. ఈ సభతో బీఆర్ఎస్ నేతలకు ధీటుగా సమాధానం ఇస్తామంటున్నారు. మొత్తానికి ఇటు జన సమీకరణ, అటు నేతల సమన్వయం వ్యవహారాల్లో తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఫుల్ బిజీగా ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com