Telangana : కొత్త మంత్రులు, సీనియర్లకు పదవులపై ఉత్కంఠ

తెలంగాణ కాంగ్రెస్ పదవుల పందేరంపై ఉత్కంఠభరిత వాతావరణం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య విభేదాలు అధిష్టానం వద్దకు చేరాయి. వ్యవహారమంతా చక్కబెట్టే ప్రక్రియ మొదలైంది. తాజాగా జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ నేపథ్యంలో సమస్య మరింతగా జఠిలమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికీ మిగిలి ఉన్న మరో మూడు మంత్రి పదవుల కోసం సీనియర్ల నుంచి జూనియర్ల వరకూ క్రమక్రమంగా పెరుగుతున్న ఒత్తిడిని తట్టుకోలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తిన బాట పట్టారు. గత రెండు రోజులుగా అక్కడే మకాం వేసి పరిస్థితులను చక్కబెట్టే పనిలో పడ్డారు. పునర్ వ్యవస్థీకరణ ముసలం మరింత ముదరక ముందే సీనియర్లను సమన్వయం చేసి సమస్యలను పరిష్కరించే దిశగా అధిష్టానం పెద్దలు రంగంలోకి దిగి అంతర్గత చర్యలు, ప్రక్షాళన మొదలు పెట్టారు. ఈ క్రమంలో తన పర్యటనలో భాగంగా రెండో రోజూ ఢిల్లీలోనే మకాం వేసిన సీఎం రేవంత్ కొత్త మంత్రులకు శాఖలపై కసరత్తు చేస్తున్నారు. పీసీసీ కమిటీల రివ్యూ, నేతల మధ్య అసంతృప్తిని భవిష్యత్తు ఆశలతో చల్లార్చే వ్యూహాలపై చర్చిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com