TG : మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధికి నిధులేవి..?

TG : మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధికి నిధులేవి..?
X

హైదరాబాద్ భాగ్యనగరంలో మెట్రో రైలు విస్తరణ, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరితే కేంద్రం పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఆరోపించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అంశాల ఊసే లేదని చెప్పారు. విద్యా, వైద్యం, నీటిపారుదల రంగాలకు కేంద్రప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు ఏ మాత్రం సహకరించడం లేదని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించిన కేంద్రం అలాగే పోలవరం ప్రాజెక్టు పూర్తికి అవసరమయ్యే నిధులన్నీ ఇస్తామని బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనపై ఆయన తీవ్రంగా విరుచుకు పడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి నిధులు ఇస్తున్న కేంద్రం పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. తెలంగాణ అభివృద్ధి చెందితే చూసి ఓర్వలేని మనస్తత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదని ఆరోపించారు.

యూపీఏ అధికారంలో ఉండగా ఐటీఐఆర్ ప్రాజెక్టుకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అనుమతులు మంజూరు చేశారని, బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ ప్రాజెక్టు అనుమతులను రద్దు చేసి తెలంగాణ నిరుద్యోగ యువత నోట్లో మట్టికొట్టిందని ఆరోపించారు. అన్ని రాష్ట్రా ల్లో ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం) ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయంలో మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఐఐఎం ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని తాను గతంలో కేంద్రానికి లేఖ రాస్తే ఇవ్వడం కుదరదంటూ మూడు రోజుల క్రితం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేఖ రాశారని, ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉంటుందా..? అని ప్రశ్నించారు.

Tags

Next Story