Miss World : ఓల్డ్ సిటీ గుల్జార్ హౌజ్.. మిస్ వరల్డ్ భావోద్వేగం

Miss World : ఓల్డ్ సిటీ గుల్జార్ హౌజ్.. మిస్ వరల్డ్ భావోద్వేగం
X

మిస్ వరల్డ్, థాయ్ బ్యూటీ ఓపల్ సుచాత హైదరాబాద్ లాడ్ బజార్ ప్రాంతంలో పర్యటించిన విషయం వైరల్ అవుతోంది. ఇటీవల చార్మినార్ సమీపంలో అగ్నిప్రమాద బాధిత గుల్జార్ హౌస్ వ్యాపారి కుటుంబంతో ఆమె ముచ్చటించిన ఫొటోలు బయటికొచ్చాయి. అగ్నిప్రమాదంలో పిల్లలు మరణించిన విషయం ఆరాతీసి విషాద భావనకు లోనయ్యారు. గత నెల 18న చార్మినార్ సమీపానున్న గుల్జార్ హౌస్ లో చెలరేగిన మంటల్లో 17 మంది మృత్యువాత పడ్డారు. కుటుంబ సభ్యులను ప్రమాదానికి ముందు ఆమె కలిసారు. తాజాగా ఆమె సామాజిక మాధ్యమాల్లో దీనిపై రియాక్టయ్యారు. అప్పటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు.

ప్రపంచ సుందరి పోటీల సన్నాహకాల్లో భాగంగా కంటెస్టెంట్లందరికీ అనేక ప్రాంతాలను పరిచయం చేసింది తెలంగాణ పర్యాటక శాఖ. ఓల్డ్ సిటీ గాజుల దుకాణాలను, గుల్జార్ హౌస్ లోని బంగారు ఆభరణాల దుకాణాలను సందర్శించారు. అప్పుడు సుచాత గుల్జార్ హౌజ్ లో సందర్శించిన దుకాణం యజమానికి చెందిన కుటుంబమే మంటల్లో ఆహుతి అయ్యింది. ఈ దుర్ఘటన తన జీవితంలో అత్యంత బాధాకరమైందని ఆమె తెలిపారు. తాను ఆ దుకాణాన్ని సందర్శించినప్పుడు ఆ కుటుంబంలోని వారంతా అప్యాయంగా సాదర స్వాగతం పలికారని, అప్పటికే అమ్మమ్మ ఇంటికి వచ్చిన పిల్లలంతా తన చుట్టూ చేరారని గుర్తు చేసుకున్నారు. ఆమె కలిసినప్పుటి సన్నివేశాన్ని వివరించారు. దురదృష్టవశాత్తు ఆ ఇంటికి మంటలు అంటుకుని ఆ కుటుంబం మరణించడం తనకు ఎంతో బాధ కలిగించిందని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె ప్రార్థించానని, మళ్ళీ జన్మలో కలుద్దామని పేర్కొంటూ వారితో తీసుకున్న ఫోటోను పోస్ట్ చేశారు.

Tags

Next Story