MLC: ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రధాన పార్టీల దృష్టి

MLC: ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రధాన పార్టీల దృష్టి
ప్రచారంలో దూసుకుపోతున్న పార్టీలు... బరిలో 52 మంది అభ్యర్థులు

వరంగల్‌- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికపై ప్రధాన పార్టీలు దృష్టి కేంద్రీకరించాయి. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు, ఆయా పార్టీల నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ ఉపఎన్నికకు 11 మంది నామినేషనన్లు ఉపసంహరించుకోగా 52 మంది బరిలో నిలిచారు. ఈ నెల 27న పోలింగ్‌ జరుగనున్న నేపథ్యంలో 25 సాయంత్రం 4 గంటల వరకే ప్రచారానికి గడువు మిగిలి ఉంది.


వరంగల్‌- ఖమ్మం- నల్గొండ.. ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో... అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం ముమ్మరం చేశారు. ఆయా పార్టీల నేతలు తమ అభ్యర్థుల గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 2021లో ఎమ్మెల్సీగా గెలుపొందిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి... ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలిచి... తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దాంతో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది. మొత్తం 52 మంది ఈ స్థానానికి పోటీపడుతుండగా... ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీఆర్‌ఎస్‌ నుంచి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి బరిలో నిలిచారు.

ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో CPM పార్టీ కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న గెలుపునకు కృషి చేస్తామని... CPM తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో లౌకిక విలువలు, ప్రజాస్వామ్యం కోసం ఇండియా బ్లాక్‌లో భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామని తెలిపారు. అలాగే ఇప్పుడు కూడా బీజేపీను ఓడించడం కోసం కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తామని వెల్లడించారు. MLC ఎన్నికల ప్రచారంలో భాగంగా తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశంలో తుంగతుర్తి MLA మందుల సామేల్ పాల్గొన్నారు. ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్నను గెలిపించి శాసనమండలికి పంపించాలని ఆయన కోరారు. సరైన నాయకులను ఎన్నుకున్నప్పుడే పట్టభద్రుల సమస్యలు పరిష్కారమవుతాయని MLA అన్నారు.


వరంగల్‌- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు భారత రాష్ట్ర సమితి ప్రయత్నిస్తోంది. రాష్ట్రంలో శాసనమండలి పునరుద్ధరణ అయినప్పటి నుంచి అక్కడ గులాబీ పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. దీంతో త్వరలో జరగనున్న ఉపఎన్నికలోనూ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు భారాస తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే జిల్లాల్లో సమావేశాలు నిర్వహించడంతో పాటు మూడు ఉమ్మడి జిల్లాల నేతలతో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశం నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. అయితే అభ్యర్థిత్వం విషయంలో కొంత మంది నేతలు అసంతృప్తిగా ఉండి ఆ సమావేశానికి రాలేదు. వారితో కేటీఆర్ ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. అందరూ కలసికట్టుగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపు కోసం పనిచేయాలని నేతలకు స్పష్టం చేశారు. జిల్లాల్లోనూ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ప్రచారంలో కేటీఆర్ పాల్గొననున్నారు. నాలుగైదు రోజుల పాటు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. అందులో భాగంగా ఇవాళ భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో కేటీఆర్ ప్రచారం చేయనున్నారు. ఈ ఎమ్మెల్సీ ఉపఎన్నికపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. విజయమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. మండలిలో తమ బలం పెంచుకునేందుకు ఈ ఉపఎన్నికల్లో గెలిచి సత్తాచాటాలని భావిస్తోంది. ఉద్యోగ, నిరుద్యోగ యువతకు... కాంగ్రెస్, భారాసలు చేసిన మోసాలను వివరిస్తూ... మండలిలో పట్టభద్రుల గళం వినిపించేందుకు భాజపాను గెలిపించాలని కమలదళం ఓట్లు అభ్యర్థిస్తోంది. భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి విజయం కోసం కమలదండు అహర్నిశలు శ్రమిస్తోంది. ప్రేమేందర్‌రెడ్డితో పాటు పార్టీ నేతలు ప్రచారాలు నిర్వహిస్తున్నారు.

Tags

Next Story