TG : పోచారానికి జాక్ పాట్.. కేబినెట్ ర్యాంక్తో కీలక పదవి

పార్టీ మారి కాంగ్రెస్ గూటికి చేరిన నేతలకు పదవులతో ప్రాధాన్యతనిచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇప్పటికే పలువురికి పదవులు కట్టబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మరో ఇద్దరికి బాధ్యతలు అప్పజెప్పింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పోచారం శ్రీనివాస రెడ్డి, గుత్తా అమిత్ లకు కీలక పదవులు దక్కాయి.
రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, డెయిరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ చైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ తొలి ప్రభుత్వంలో టీఆర్ఎస్ సర్కార్ హయంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ తర్వాత స్పీకర్ గా బాధ్యతలు నిర్వహించారు.
మాజీ సీఎం కేసీఆర్ కు సన్నిహితుడిగా పేరున్న ఆయన ఇటీవలే కారు దిగి కాంగ్రెస్ లో చేరారు. అదేవిధంగా శాసనసభ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డికి డెయిరీ డెవలప్ మెంట్ కో ఆపరేటివ్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం వెలువరించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com