TG : రైలు పట్టాలపై 3 నెలల పసికందు.. రక్షించిన రైల్వే, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు

ముక్కు పచ్చలారని మూడు నెలల పసికందును రైల్వే పట్టాల మధ్యన వదిలివెళ్లిన హృదయ విదారక ఘటన మంగళవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూనారం రైల్వే గేటు వద్ద చోటు చేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి పట్టణం కూనారం రైల్వే గేటు వద్ద పట్టాలపై పసికందును చూసినవారు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. చైల్డ్ హెల్ప్ లైన్ డీసీపీ కమలాకర్ ఆదేశాల మేరకు 1098 హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ ఉమాదేవి, సూపర్వైజర్ రమాదేవి, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి కనకరాజు పసికందును పట్టాల నుండి తీసి రక్షించారు. 3 నెలల బాబుగా గుర్తించారు. హుటాహుటిన పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులు, సిబ్బంది, ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది పర్యవేక్షణలో బాబును ఆస్పత్రిలో ఉంచి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారు. వెంటనే స్పందించి బాబును రక్షించిన అధికారులను ప్రజలు అభినందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com