TG : తెలంగాణలో ఇవాళ్టి నుంచి 4 రోజుల పాటు వర్షసూచన

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో నేటి నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణలోని దక్షిణ జిల్లాల్లో వర్షాలకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. మిగిలిన కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు. దీనికి తోడు తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మెదక్ జిల్లాలో 15 డిగ్రీల కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
హైదరాబాద్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. నగరం అంతటా ఉదయం పొగమంచు ఉంటుంది. నగర శివార్లలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదు అవుతుంది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com