TG : సంగారెడ్డి జైలు నుంచి లగచర్ల రైతుల విడుదల

లగచర్లలో అధికారులపై దాడి కేసులో అరెస్టైన రైతులు సంగారెడ్డి జైలు నుంచి విడుదల అయ్యారు. వీరికి గిరిజన సంఘాలు స్వాగతం పలికాయి. రైతులకు 2 రోజుల క్రితం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయగా గురువారమే రిలీజ్ కావాల్సింది. సాయంత్రం 6 గంటలలోగా బెయిల్కు సంబంధించిన పత్రాలు సిద్ధం కాకపోవడంతో ఈ ఉదయం విడుదల చేశారు.
ఇదే కేసులో A1గా ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తో పాటు మొత్తం 24 మందికి నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నరేందర్రెడ్డికి రూ.50 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని, 3 నెలల పాటు ప్రతి వారం రోజులకు ఒకసారి బొంరాస్పేట ఎస్హెచ్వో ఎదుట హాజరై విచారణకు సహకరించాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఇదే కేసులో నిందితులు ఉన్న ప్రతి ఒక్కరూ రూ.20 వేల పూచీకత్తు సమర్పించాలని, ప్రతి వారం పోలీసుల ఎదుట హాజరు కావాలని షరతులు విధించింది. అయితే, కేసులో ప్రధాన నిందితుడు భోగమోని సురేశ్ తో పాటు మరో ఏడుగురికి బెయిల్ లభించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com