TG : మానుకోట నుంచే సీఎం రేవంత్ పతనం : సత్యవతి రాథోడ్

కాంగ్రెస్ నాయకుల ఆదేశాలతోనే మహబూబాబాద్లో బీఆర్ఎస్ మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఆరోపించారు. శుక్రవారం ఆమె తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. మహా ధర్నాకు అనుమతి ఇచ్చిన న్యాయ స్థానానికి ధన్యవాదాలు చెప్పారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డికి చెంపపెట్టని అన్నారు. రాహుల్ గాంధీ ఏమో రాజ్యాగాన్ని పట్టుకొని పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేస్తారు.. రేవంత్ రెడ్డి ఏమో అదే రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. లగచర్ల గిరిజన రైతులు ఎదురు తిరగడం చూసి రేవంత్ రెడ్డి ఖంగుతిన్నారని ఎద్దేవా చేశారు. లగచర్ల రైతులనే మెప్పించని రేవంత్ రెడ్డి.. రాష్ట్ర రైతులను ఎలా మెప్పిస్తారని ప్రశ్నించారు. కనీసం ఊరు దాటని గిరిజన మహిళలు, ఢిల్లీ వరకు వెళ్లి ఫిర్యాదు చేశారంటే.. తెలంగాణలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఇకనైనా రేవంత్ రెడ్డి కళ్లు తెరవాలి, లగచర్లలో ఫార్మా విలేజ్ను రద్దు చేసుకోవాలని కోరారు. ఇప్పుడు మానుకోట నుంచే రేవంత్ రెడ్డి పతనం స్టార్ట్ అయ్యిందని కీలక వ్యాఖ్యలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com