REVANTH: బాబు అరెస్ట్‌పై తెలంగాణలో ఆందోళనలు చేస్తే తప్పేంటి?

REVANTH: బాబు అరెస్ట్‌పై తెలంగాణలో ఆందోళనలు చేస్తే తప్పేంటి?
చంద్రబాబు అరెస్టు ఏపీకే పరిమితమైన అంశం కాదన్న రేవంత్‌రెడ్డి... ఆంధ్రావాళ్ల ఓట్లు కావాలి గానీ.. వాళ్లకు హక్కులు వద్దా?...

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అరెస్టుపై తెలంగాణలో నిరసనలు చేస్తే తప్పేంటని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే సంబంధించిన అంశం కాదని స్పష్టం చేశారు. చంద్రబాబు దేశ నాయకుడని, ఆయన అరెస్టుపై తెలంగాణలో నిరసన తెలపడంలో తప్పేముందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిరసన తెలిపే వాళ్లు అంతా ఇక్కడి ఓటర్లే అని, నిరసనకారులను నియంత్రించడంలో అర్థం లేదన్నారు. హైదరాబాద్ పదేళ్ల పాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఏపీకి సంబంధించిన అంశంపై ఇక్కడ నిరసన జరపొద్దు అంటే ఎలా? అని ప్రశ్నించారు. నిరసనలు చేయవద్దన్న కేటీఆర్ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు.


చంద్రబాబుకు ఉన్నంత అనుభవం కలిగిన నేతలను వేళ్లపై లెక్కించవచ్చని రేవంత్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు అరెస్టుపై హైదరాబాద్‌లో నిరసన తెలిపిన వారంతా ఇక్కడి ఓటర్లేనని గుర్తు చేశారు. ఆంధ్రా వాళ్ల ఓట్లు కావాలి గానీ వాళ్లకు హక్కులు వద్దా? అంటూ మంత్రి కేటీఆర్‌ను రేవంత్‌ ప్రశ్నించారు. హైదరాబాద్‌ పదేళ్లపాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అని గుర్తు చేశారు. ఏపీకి సంబంధించిన అంశంపై ఇక్కడ నిరసన చేయవద్దన్న మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు అర్థరహితమని, నిరసన తెలిపే హక్కును ఎవరూ కాలరాయలేరని అన్నారు. ఉద్యమ సమయంలో అమెరికాలోనూ నిరసన తెలిపారు. ప్రతి సమస్యకూ ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఆదోళనలు చేస్తున్నారు. ఏం హక్కుందని ఢిల్లీలో నిరసనలు చేశార అని రేవంత్‌ ప్రశ్నించారు. ఎవరు ఏ సమస్యపై అయినా.. ఎక్కడైనా నిరసన తెలపవచ్చునని స్పష్టం చేశారు.


కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లి తెలంగాణ అంశంపై నిరసన తెలపొచ్చుగానీ.. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇక్కడి ఐటీ వాళ్లు నిరసన తెలియజేస్తే మాత్రం అడ్డుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే వినతిపత్రం తీసుకుని అనుమతి ఇవ్వాలని, తిరస్కరించడం తప్పు అని అన్నారు. ఆంధ్రావాళ్లతో పన్నులు కట్టించుకుని, వారి ఓట్లు వేయించుకుని, వారి సమస్యను తమ రాష్ట్రం సమస్య కాదంటూ కేటీఆర్‌ మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. వచ్చే ఎన్నికల్లో సెటిలర్లు బీఆర్‌ఎస్‌కు కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు. కాంగ్రెస్‌ విజయభేరి సభను చూసి సీఎం కేసీఆర్‌కు చలిజ్వరం వచ్చిందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్ని దివాళా తీయించిన కేసీఆర్‌.. ఆయన లక్కీ నెంబర్‌ ప్రకారం రూ.6 లక్షల కోట్ల మేరకు అప్పుల్లో ముంచారని ఆరోపించారు. తమ నేత రాహుల్‌గాంధీ.. కేసీఆర్‌ లాగా బ్లఫ్‌ మాస్టర్‌ కాదని, వాస్తవాలు-గణాంకాలతో మాట్లాడతారని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story