హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

జాతీయ రహదారులు మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై చేవెళ్ల మండలం మల్కాపూర్ గేట్ వద్ద బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో చిన్నారితో సహా ఆరుగురు మృతి చెందారు. ఐదుగురు గాయపడ్డారు. చేవెళ్ల సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాదులోని తాడ్బండ్ ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబంలోని 11 మంది కర్ణాటక రాష్ట్రంలోని గుర్మిత్కల్కు తెల్లవారుజామున బయల్దేరారు.
చేవెళ్ల మండలంలోని కందవాడ స్టేజి దాటిన తర్వాత రోడ్డు మలుపులో వీరు ప్రయాణిస్తున్న కారు.. ముందుగా వెళ్తున్న వాహనాలను ఓవర్ టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న బోర్వెల్ లారీని ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఆసిఫ్ఖాన్, సానియా, నజియా బేగం, హర్ష, నజియా భాను, హర్షభానుగా గుర్తించారు. సయ్యబ్, అలీబేగం తవ్రంగా గాయపడగా, నౌషీర్, అన్వర్ఖాన్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడినవారిని హైదరాబాద్లోని ప్రవేట్ ఆస్పత్రికి తరలించగా, స్వల్పంగా గాయపడిన వారిని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్మార్టంకి పంపించారు. ప్రమాద తీవ్రతతో కారు నుజ్జు నుజ్జయింది. ప్రమాద ఘటనతో బీజాపూర్ జాతీయరహదారిపై రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామయింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com