TG : బాబోయ్.. ఇదేం చలి!

తెలంగాణలో పలు జిల్లాలను చలి వణికిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్రమంగా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం కనిష్ఠ ఉష్ణోగ్రత 7°C నమోదైంది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 9 వరకు చలి ప్రభావం ఉంటుండగా వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికి తోడు పొగమంచు కారణంగా వాహనదారులు లైట్లు వేసుకొని నెమ్మదిగా వెళ్లాలని పోలీసులు చెబుతున్నారు. తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కంటే 2-4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో చలిగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. ముఖ్యంగా ఏజెన్సీ గిరిజన గ్రామాలను పొగమంచు కప్పేయడంతో చలి తీవ్రతకు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. రాత్రి పగలు అనే తేడా లేకుండా జిల్లావ్యాప్తంగా చలి తీవ్రత కనిపిస్తోంది. అంతటా పగలంతా వెచ్చని దుస్తులను ధరించి ప్రజలు బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో వృద్ధులు, చిన్నపిల్లలు ఇంటి నుంచి బయటకు వచ్చేం దుకు జంకుతున్నారు. ప్రధానంగా జిల్లాలోని మారుమూల గిరిజన తండాలు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే పట్టపగలే చలి మంటలు వేసుకుంటూ ప్రజలు వెచ్చదనం పొందుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com