CM Revanth Reddy : మోడీకి షాక్.. రేవంత్ సర్కార్ చేసిన తీర్మానం ఏంటంటే?

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ ( Revanth Reddy ) పదే పదే విమర్శిస్తున్నారు. కేంద్రం తీరుకు నిరసనగా అసెంబ్లీలో ఓ తీర్మానం చేశారు. ఆ తీర్మానంలో ఏం ఉంది అనేది ఆసక్తికరంగా మారింది. "డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం భారతదేశం రాష్ట్రాల సమాఖ్య. అన్ని రాష్ట్రాల సమీకృత సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభ బాధ్యత. ఈ ఫెడరల్ స్పూర్తిని కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు వివక్ష జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇదే ధోరణి కొనసాగించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వవ్యస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల సుస్థిర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. కానీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది." అని రేవంత్ తన తీర్మాన ప్రతిలో ఉన్న అంశాలను చదివి వినిపించారు.
"పార్లమెంటులో చేసిన విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు ఇప్పటికీ అమలు కాకపోవటం తెలంగాణ ప్రగతిపై తీవ్రమైన ప్రభావం చూపింది. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు పలు దఫాలుగా ప్రధాన మంత్రిని, ఇతర కేంద్ర మంత్రులను కలిసి వివిధ విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోరటంతో పాటు చట్ట ప్రకారం రావాల్సిన నిధులు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై అనేక సార్లు అభ్యర్థనలు అందించారు. కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల పూర్తిగా వివక్ష చూపించింది. అందుకే తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర అనుసరించిన తీరుపై ఈ సభ తీవ్ర సంతృప్తిని నిరసనను తెలియజేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్ కు సవరణలు చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేటట్లు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ సభ తీర్మానం చేస్తుంది" అని సభలో సీఎం రేవంత్ తీర్మానం ప్రవేశపెట్టారు.
ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com