Singareni Merit Scholarship : సింగరేణిలో మెరిట్ స్కాలర్ షిప్ రూ. 16 వేలకు పెంపు

Singareni Merit Scholarship : సింగరేణిలో మెరిట్ స్కాలర్ షిప్ రూ. 16 వేలకు పెంపు
X

సింగరేణిలో మెరిట్ స్కాలర్ షిప్ ను రూ. 16 వేలకు పెంచుతూ సింగరేణి యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్, నీట్, జేఈఈ మెయిన్స్, ఎయిమ్స్ తదితర కోర్సుల ప్రవేశపరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన సింగరేణి కార్మికులు, అధికారుల పిల్లలకు ఇప్పటివరకు ఇస్తున్న వార్షిక స్కాలర్ షిప్ మొత్తాన్ని 10 వేల నుండి 16 వేల రూపాయలకు పెంచుతూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే కనీస ర్యాంక్ 2000 లోపు నుండి 8000 లోపు వరకు పెంచినట్లు ప్రకటించింది. కార్మికుల పిల్లలను ఉన్నత చదువుల పట్ల ఆసక్తి పెంచడానికి, ప్రోత్సహించడానికి 1998లో ఈ స్కాలర్ షిప్ పథకాన్ని ప్రవేశపెట్టారు. 2000 లోపు ర్యాంకు సాధించిన ఉద్యోగుల పిల్లలకు మాత్రమే దీనిని వర్తింపజేశారు. అన్ని ఏరియాల నుండి అర్హులు ఉండి దరఖాస్తులు స్వీకరించి, విద్యార్థి చదివే కోర్సు పూర్తయ్యేంత వరకు ఏడాదికి 6000 రూపాయలు చొప్పున స్కాలర్ షిప్ ను కంపెనీ ప్రతి ఏడాది అందిస్తూ వస్తోంది.

స్కాలర్ షిప్ మొత్తాన్ని పెంచాలని వచ్చిన విజ్ఞప్తి మేరకు 2010లో దీనిని 10 వేల రూపాయలకు పెంచారు. కాగా ఇటీవల గుర్తింపు కార్మిక సంఘంతో జరిగిన నిర్మాణాత్మక సమావేశంలో స్కాలర్షిప్ గా చెల్లించే మొత్తాన్ని రూ.10 నుండి రూ.16 వేలకు పెంచాలని, స్కాలర్షిప్ వర్తింపును కూడా 2000 ర్యాంకు లోపు నుండి 8000 ర్యాంకు లోపు వరకు పెంచాలని గుర్తింపు సంఘం నాయకులు యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఈ విన్నపానికి సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ సానుకూలంగా స్పందించారు. ఆయన ఆదేశాలమేరకు సవరించిన స్కాలర్ షిప్ నకు సంబంధించిన ఉత్తులను ను డైరెక్టర్ పా జారీ చేశారు. ఈ ఉత్తర్వులు 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశ పరీక్షలకు హాజరైన విద్యార్థిని విద్యార్థులకు వర్తిస్తుందని ఈ మేరకు అన్ని ఏరియాల నుండి జూన్ 15 లోపు దరఖాస్తులు పంపించాలని డైరెక్టర్ పా వెల్లడించారు. ఎంసెట్ ప్రవేశ పరీక్షల్లో 8 వేల ర్యాంకు వరకు సాధించిన వారికి వారి కోర్సు పూర్తయ్యేంత వరకు ఏడాదికి 16,000 చొప్పున స్కాలర్ షిప్ గా సంస్థ చెల్లిస్తుందని అలాగే జేఈఈ మెయిన్స్ (ఎన్.ఐ.టి), ఎయిమ్స్, బిట్ సాట్ (బిట్స్ పిలాని) లో ప్రవేశం పొందిన వారికి అత్యుత్తమ ర్యాంకు ఆధారంగా స్కాలర్ షిప్ ను వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ఈ సదవకాశాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.

Tags

Next Story