TG BRS Party : కవితపై వేటుకు రంగం సిద్ధం?

పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వేటు వేయాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. గురువారం తన నివాసంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన కవిత.. పార్టీ విధానాలను, నాయకత్వాన్ని తూర్పారబట్టిన విషయం తెలిసిందే. కవిత వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్న కేసీఆర్ తాజా పరిణామాలపై అందుబాటులో ఉన్న సీనియర్ నేతలతో గురువారం సాయంత్రం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో సమావేశమయ్యారు. లండన్ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతోనూ ఫోన్ లో సమాలోచనలు జరిపినట్టు తెలుస్తోంది.
కేసీఆర్ తో సమావేశమైన నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించడంతోపాటు కేటీఆర్ పై, పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై కవిత చేసిన ఆరోపణల పట్ల మెజారిటీ నేతలు తమ అసహనాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. కవిత చేసిన ఆరోపణలపై ఇప్పటికిప్పుడే చర్యలు తీసుకోవాలా..? లేక ఆమె చేసిన వ్యాఖ్యలకు నోటీసులు జారీ చేయాలా..? అనే అంశంపై తర్జన భర్జనలు పడినట్టు సమాచారం. షోకాజ్ నోటీసులు జారీ చేయడం వల్ల సమస్యను సాగదీసినట్టు అవుతుందని, పరిణామాలు ఇంతదూరం వచ్చాక నోటీసులు ఇవ్వడం కంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే మంచిదన్న అభిప్రాయాన్ని కేసీఆర్ను కలిసిన నేతలంతా వ్యక్తం చేసినట్టు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్ర, లేదా శనివారాల్లో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ క్రమశిక్షణా సంఘం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com