T BJP: అధ్యక్షుడి మార్పుపై నో క్లారిటీ..
కాసేపట్లో హైదరాబాద్కు రానున్నారు టీబీజేపీ చీఫ్ బండి సంజయ్. నిన్న అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన బండి కేబినెట్ భేటీలో క్లారిటీ రాకపోవడంతో వెనుదిరిగారు. అయితే బీజేపీ అధ్యక్షుడి మార్పుపై జోరుగా చర్చ నడుస్తున్న నేపధ్యంలో స్పందిచిన బండి వర్గం అదంతా మీడియా సృష్టేనని కొట్టి పాడేసింది. దీనిపై ఢిల్లీలో ఎలాంటి చర్చ జరగలేదని, అధిష్టానానికి తప్పుడు సమాచారంతోనే గందరగోళం ఏర్పడిందని అంటున్నారు. అధ్యక్షుడి మార్పుపై మరో పదిరోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలిపింది బండి వర్గం.
మరోవైపు ఢిల్లీలోని రాజకీయవర్గాల్లో ఊహాగానాలు విస్తృతంగా వినపడుతున్నాయి.కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని పార్టీలోనూ సంస్థాగత మార్పులు జరుగుతాయని, పలు రాష్ట్రాల్లో అధ్యక్షుల్ని మారుస్తారని జోరుగా వార్తలు వస్తున్న సమయంలో జరిగిన ఈ సమావేశం తుఫాను ముందరి ప్రశాంతతను తలపించింది. అయితే మంత్రి మండలి సమావేశం నుంచి వచ్చిన తర్వాత ఏ ఒక్క మంత్రీ పెదవి విప్పేందుకు ఉత్సాహం ప్రదర్శించలేదు. తమకు ఏ బాధ్యత అప్పచెబుతారనే విషయమై ప్రధానమంత్రి కార్యాలయం,హోంమంత్రి అమిత్ షా నుంచి సంకేతాలు అందవచ్చని ఒక మంత్రి తెలిపారు. పలువురు మంత్రులు తమకు పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. వచ్చేవారంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని, అయితే ఈ లోపే పార్టీకి సంబంధించిన సంస్థాగత మార్పులు జరిగే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి పలు సంస్థాగత మార్పులు ఉంటాయని వాటిని ఒకటిరెండు రోజుల్లో అమలు చేస్తారని తెలుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com